Wednesday, 30 August 2017

సాలిగ్రామం ఎలా పుట్టింది.............?

మిత్రులకు శుభోదయం.
సాలిగ్రామం ఎలా పుట్టింది.............?
గండకీ సరసస్తీరే చంద్ర తీర్థేన శోభితే|
సాలగ్రామ పురశ్రేష్ఠ కనకాఖ్య విమానగ:||
శ్రీ మూర్తిదేవ శ్శ్రీ దేవ్యా కుబేరోముఖ సంస్థిత:|
గండకీ గణికా రుద్ర బ్రహ్మణా మక్షిగోచర:
శ్రీవిష్ణుచిత్త కలిజిత్ స్తుతి భూషిత నిగ్రహ:||
సాలిగ్రామం అంటే తెలుసా.......? విష్ణు చిహ్నంగల శిలనే సాలిగ్రామం అంటారు. అలాంటి సాలిగ్రామాలు ఒకటి కాదు రెండు కాదు వందలూ వేలు కాదు, లెక్కకు మిక్కిలిగా ఆ ఒక్క నదిలోనే పుడతాయి. మరెక్కడా దొరకవవి. ఆనది పేరు గండకీ. చిన్నగా పెద్దగా రకరకాల పరిమాణాల్లో ఉంటాయి. గండకీ నదిలోనే దొరుకుతాయి. గుండ్రని రాళ్ళలా ఉన్నా – తాబేలు నోరు తెరచుకున్నట్టు ఉండి లోపల శ్రీ మహా విష్ణువే శేషసాయిగా ఉండి దర్శన మిస్తాడంటారు. పూజిస్తుంటారు. మరి గండకీ నదిలోనే ఈ సాలిగ్రామాలు పుట్టడానికి వెనుక ఒక కథ ఉంది!
గండకీ నది నదిగా మారడానికి ముందు ఒక స్త్రీ, గండకీ పేరుతోనే శ్రావస్తి నగరంలో ఉండేది. ఆమె అందాల వేశ్య. ఆమె అనుగ్రహం కోరి ధనవంతులు కూడా పరితపిస్తూవుండేవారు. గండకీ అందరినీ అంగీకరించేది కాదు. ప్రతి రోజూ ముందొచ్చిన బేరం ఒప్పుకొనేది. ఆరోజుకి అతనే భర్త. రెండో మనిషికీ రెండో బేరానికి ఒప్పుకొనేది కాదు. ధనం ఆశ చూపినా దరి చేరనిచ్చేది కాదు. ఆమె తల్లి గండ్రకి మార్చాలని ఎన్నోవిధాల ప్రయత్నించి విఫలమైంది. సాక్షాత్తూ నారాయణుడికే గండకిని పరీక్షించాలని కోరిక పుట్టింది.
ఒక రోజు పరివారంతో పొద్దున్నే వచ్చిన ధనవంతుడు బేరం చేసుకొని కానుకలు ఇచ్చాడు. అలవాటుగా గండ్రకి అతనికి స్నానం చేయించాలని దుస్తులు తీస్తే దుర్వాసన… ఒళ్ళంతా పుండ్లు. ఈగల ముసిరాయి. కుష్టు వ్యాధి ఉందని కూడా గ్రహించింది. తల్లి తిట్టి పొమ్మనబోతే గండ్రకి ఆమెనే తరిమేసింది. సంపంగి తైలం పూసింది. గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేయించింది. చేనేత వస్త్రాలు చుట్టింది. చక్కని భోజనం పెట్టింది. అతడు తినబోతే పుచ్చిన చేతులు. వేళ్లూడి పడితే పక్కన తీసి పెట్టింది. తినిపించింది. అదే కంచంలో తానూ తిన్నది. పక్కమీదకు చేర్చింది. విసురుతూ కూర్చుంది. జ్వరంతో అతడు ఆ రాత్రే ప్రాణాలు వదిలాడు. అప్పటి ఆచారం ప్రకారం సహగమనానికి పూనుకుంది. తల్లీ బంధువులూ తల్లడిల్లినా ఆగలేదు. తాళి కట్టని భార్యలా తల్లడిల్లింది. తనువుని చాలించదలచింది. ఉన్న ధనమంతా బీదసాదాలకు పంచి పెట్టింది. ధాన ధర్మాలు చేసి దహన కార్యక్రమానికి శవం వెంట మేళ తాళాలతో వెళ్ళింది. శ్మశాసనంలో చితి పేర్చింది. తనే నిప్పంటించింది. తనూ చితిలోకి దూకింది. చిత్రంగా ఎగిసిన మంటలు మల్లెలయ్యాయి. కాలిన కట్టెలు పువ్వులయ్యాయి. లక్ష్మి సమేతంగా విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. గండకి చూస్తూనే ముగ్దురాలైంది. చేతులు జోడించింది. కన్నీళ్ళతో కీర్తించింది. కీర్తిస్తూ కాళ్ళు కడిగింది. శరీరమూ మనసూ స్వచ్ఛంగా నిలిపింది.
గండకి పవిత్రతకు నారాయణుడు పరవశించిపోయాడు. ఆమె నియమ నిబంధనలకు నిర్ఘాంతపోయాడు. ఆమె నిశ్చలతకు చలించిపోయాడు. నిష్టకు ఇష్టపడ్డాడు. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. గండకి డబ్బూ ధనం కోరలేదు. మోక్షమూ కోరలేదు. మాతృత్వాన్ని వరంగా కోరింది. మహా విష్ణువుని తన కడుపున కొడుకుగా పుట్టాలని కోరింది. ఫలితమే. మరు జన్మలో గండకీ నదిగా పుట్టింది. నది కడుపులో సాలిగ్రామాల రూపంలో విష్ణుమూర్తి పుట్టి పూజలందుకున్నాడు.
గండకి ఏకులంలో పుట్టినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనసు మలినం కాలేదు. ఆ విధంగా పవిత్రురాలైంది. విష్ణుమూర్తిని తన గర్భంలో దాచుకొని తల్లయింది. కృతయుగాన జరిగినా ఈయుగానికీ గండకీ కథ నిలిచిపోయింది!.

Monday, 28 August 2017

మంత్రాత్మక శ్రీ మారుతి స్తోత్రం............... మన్యుసూక్తం......

మిత్రులకు శుభోదయం.
మంత్రాత్మక శ్రీ మారుతి స్తోత్రం............... మన్యుసూక్తం......
ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే |
నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే || ౧ ||
మోహశోకవినాశాయ సీతాశోకవినాశినే |
భగ్నాశోకవనాయాస్తు దగ్ధలంకాయ వాగ్మినే || ౨ ||
గతి నిర్జితవాతాయ లక్ష్మణప్రాణదాయ చ |
వనౌకసాం వరిష్ఠాయ వశినే వనవాసినే || ౩ ||
తత్త్వజ్ఞాన సుధాసింధు నిమగ్నాయ మహీయసే |
ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయ తే || ౪ ||
జన్మమృత్యుభయఘ్నాయ సర్వక్లేశహరాయ చ |
నేదిష్ఠాయ ప్రేతభూత పిశాచభయహారిణే || ౫ ||
యాతనా నాశనాయాస్తు నమో మర్కటరూపిణే |
యక్ష రాక్షస శార్దూల సర్పవృశ్చిక భీహృతే || ౬ ||
మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్ధతే |
హారిణే వజ్రదేహాయ చోల్లంఘిత మహాబ్దయే || ౭ ||
బలినామగ్రగణ్యాయ నమో నః పాహి మారుతే |
లాభదోసి త్వమేవాశు హనుమాన్ రాక్షసాంతకః || ౮ ||
యశో జయం చ మే దేహి శతౄన్ నాశయనాశయ |
స్వాశ్రితానామభయదం య ఏవం స్తౌతి మారుతిమ్ |
హానిః కుతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్ || ౯ ||
మన్యుసూక్తం......
యస్తే” మన్యో‌உవి’ధద్ వజ్ర సాయక సహ ఓజః’ పుష్యతి విశ్వ’మానుషక్ |
సాహ్యామ దాసమార్యం త్వయా” యుజా సహ’స్కృతేన సహ’సా సహ’స్వతా || 1 ||
మన్యురింద్రో” మన్యురేవాస’ దేవో మన్యుర్ హోతా వరు’ణో జాతవే”దాః |
మన్యుం విశ’ ఈళతే మాను’షీర్యాః పాహి నో” మన్యో తప’సా సజోషా”ః || 2 ||
అభీ”హి మన్యో తవసస్తవీ”యాన్ తప’సా యుజా వి జ’హి శత్రూ”న్ |
అమిత్రహా వృ’త్రహా ద’స్యుహా చ విశ్వా వసూన్యా భ’రా త్వం నః’ || 3 ||
త్వం హి మ”న్యో అభిభూ”త్యోజాః స్వయంభూర్భామో” అభిమాతిషాహః |
విశ్వచ’ర్-షణిః సహు’రిః సహా”వానస్మాస్వోజః పృత’నాసు ధేహి || 4 ||
అభాగః సన్నప పరే”తో అస్మి తవ క్రత్వా” తవిషస్య’ ప్రచేతః |
తం త్వా” మన్యో అక్రతుర్జి’హీళాహం స్వాతనూర్బ’లదేయా”య మేహి’ || 5 ||
అయం తే” అస్మ్యుప మేహ్యర్వాఙ్ ప్ర’తీచీనః స’హురే విశ్వధాయః |
మన్యో” వజ్రిన్నభి మామా వ’వృత్స్వహనా”వ దస్యూ”న్ ఋత బో”ధ్యాపేః || 6 ||
అభి ప్రేహి’ దక్షిణతో భ’వా మే‌உధా” వృత్రాణి’ జంఘనావ భూరి’ |
జుహోమి’ తే ధరుణం మధ్వో అగ్ర’ముభా ఉ’పాంశు ప్ర’థమా పి’బావ || 7 ||
త్వయా” మన్యో సరథ’మారుజంతో హర్ష’మాణాసో ధృషితా మ’రుత్వః |
తిగ్మేష’వ ఆయు’ధా సంశిశా”నా అభి ప్రయం”తు నరో” అగ్నిరూ”పాః || 8 ||
అగ్నిరి’వ మన్యో త్విషితః స’హస్వ సేనానీర్నః’ సహురే హూత ఏ”ధి |
హత్వాయ శత్రూన్ వి భ’జస్వ వేద ఓజో మిమా”నో విమృధో” నుదస్వ || 9 ||
సహ’స్వ మన్యో అభిమా”తిమస్మే రుజన్ మృణన్ ప్ర’మృణన్ ప్రేహి శత్రూ”న్ |
ఉగ్రం తే పాజో” నన్వా రు’రుధ్రే వశీ వశం” నయస ఏకజ త్వమ్ || 10 ||
ఏకో” బహూనామ’సి మన్యవీళితో విశం”విశం యుధయే సం శి’శాధి |
అకృ’త్తరుక్ త్వయా” యుజా వయం ద్యుమంతం ఘోషం” విజయాయ’ కృణ్మహే || 11 ||
విజేషకృదింద్ర’ ఇవానవబ్రవో(ఓ)3’‌உస్మాకం” మన్యో అధిపా భ’వేహ |
ప్రియం తే నామ’ సహురే గృణీమసి విద్మాతముత్సం యత’ ఆబభూథ’ || 12 ||
ఆభూ”త్యా సహజా వ’జ్ర సాయక సహో” బిభర్ష్యభిభూత ఉత్త’రమ్ |
క్రత్వా” నో మన్యో సహమేద్యే”ధి మహాధనస్య’ పురుహూత సంసృజి’ || 13 ||
సంసృ’ష్టం ధన’ముభయం” సమాకృ’తమస్మభ్యం” దత్తాం వరు’ణశ్చ మన్యుః |
భియం దధా”నా హృద’యేషు శత్ర’వః పరా”జితాసో అప నిల’యంతామ్ || 14 ||
ధన్వ’నాగాధన్వ’ నాజింజ’యేమ ధన్వ’నా తీవ్రాః సమదో” జయేమ |
ధనుః శత్రో”రపకామం కృ’ణోతి ధన్వ’ నాసర్వా”ః ప్రదిశో” జయేమ ||
భద్రం నో అపి’ వాతయ మనః’ ||
ఓం శాంతా’ పృథివీ శి’వమంతరిక్షం ద్యౌర్నో” దేవ్య‌உభ’యన్నో అస్తు |
శివా దిశః’ ప్రదిశ’ ఉద్దిశో” న‌உఆపో” విశ్వతః పరి’పాంతు సర్వతః శాంతిః శాంతిః శాంతిః’ ||

హనుమంతుడికి తమలపాకులతో పూజలు చేయడం మనకు తెలిసిన విషయమే. అలాగే ఇష్టమైన పుష్పాలు ఏమిటో తెలుసుకుందాం. హనుమంతునికి పొన్నపువ్వు, మొగలి, పొగడ, నందివర్ధనము, మందారము, కడిమి, గజనిమ్మ, పద్మము, నల్లకలువ, ఎర్ర గన్నేరు, సన్నజాజి, మల్లె, గులాబి, మోదుగ, సంపంగి, కనకాంబర, మెట్ట తామర, పొద్దు తిరుగుడు పువ్వులంటే చాలా ఇష్టం.
అలాగే మంకెన, బండికెరివెంద, అడవిమల్లె, సురపున్నాగ, కుంకుమ పువ్వు, మద్ది, సువర్ణ పుష్పం, గౌరీ మనోహరం వంటి పుష్పాలతో పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయి.
ఇంకా పసుపు, అక్షింతలు, తిరుమారేడు, నేరేడు, రుధ్ర జడ, తులసి, మాచిపత్రి, ఎర్రకలువ, గోరింట, ఉత్తరేణి, తమలపాకులంటే ఆంజనేయ స్వామికి ఇష్టం. ఈ పుష్పాలతో స్వామిని పూజించే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. సమస్త గ్రహదోషాలు నివారింపబడతాయి.

Sunday, 27 August 2017

ఓం నమో భగవతే వాసుదేవాయ ! ఈ మంత్రం ఎందుకు జపించాలి.............?

ఓం నమో భగవతే వాసుదేవాయ ! ఈ మంత్రం ఎందుకు జపించాలి.............?
ఇప్పటికి సరిగ్గా 1500 సంవత్సరాల క్రితం సంఘటన.
ఒక ముసలివాడు ”ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని వల్లెవేస్తూ గంగానది తీరంలో నడుస్తున్నాడు. చేతిలో జపమాల మెడలో రుద్రాక్ష హారం ధరించాడు. ఈ నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రం చదవడం వలన ఆ తరంగాలు కలిపురుషుడు ని తాకాయి. ఎక్కడి నుండి వస్తున్నది ”ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్ర శబ్దం అని చుట్టూ పరికించాడు. గంగానది తీరంలో ఒక బక్కచిక్కిన ముదుసలి ”ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే నామాన్ని జపించడం చూసి ఆ మంత్ర జపాన్ని ఆపాలని ఆ ముసలివాడి దగ్గరికి వెళ్లి పట్టుకోబోయాడు. అయన మీద చేయి వేసిన వెంటనే ఎగిరి అర యోజన దూరం లో పడ్డాడు. కొంతసేపు ఏమి జరిగిందో తెలియక చూస్తే ఆ ముసలివాడు ముందు ఎక్కడో ”ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని జపిస్తూ వెళ్తున్నాడు. ఎలాగైనా పట్టుకుని నామజపాన్ని ఆపాలని దగ్గరికి వెళ్ళాడు. పట్టుకోబోతే ఈసారి యోజనం దూరంలో పడ్డాడు. ఆ దెబ్బకి కలిపురుషుడు గజగజ ఒణికిపోయాడు. చూస్తే బక్కచిక్కి ఉన్నాడు. గట్టిగా గాలి వస్తే ఎగిరేలా ఉన్నాడు. కాని పట్టుకుందామంటే నేను ఎక్కడో పడుతున్నాను.
ఒకవేళ నాశక్తి సన్నగిల్లిందా? కలియుగం ఆరంభంలో కృష్ణుడు వలన నా రాక ఆలస్యం అయింది. ఇదేమైన శ్రీకృష్ణుడి మాయా ప్రభావమా? అసలు ఇంతకీ ఆ ముసలివాడు ఎవ్వడు. శివుడా? విష్ణువా? అనుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న ”వేదవ్యాసుడు” కనిపించాడు. కలి వెంటనే వ్యాసుడు దగ్గరికి వెళ్లి మహానుభావ సమయానికి వచ్చావు. నా సందేహాన్ని నివృత్తి చేయండి. అన్నాడు. వ్యాసుడు నవ్వి. ఇది నీరాజ్యం. ఈకలికాలం నీది. నీకు సందేహమా?
ఏ ఇద్దరుని సక్రమంగా ఉండనివ్వవు. ఎవరైనా కలిసున్నారంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటావు. ఇలాంటి నీకు నా అవసరం ఏముంది? ఇంతకి నువ్వు కుశలమే కదా!
కుశలమే! నారాజ్యంలో నేను కాక నువ్వు పాలించవు. కదా! అదిగో ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలివాడు ఎవరు? ఆయన్ని పట్టుకోబోతే నా బలం సరిపోవడం లేదు. ఇదసలు నా రాజ్యమేనా? లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తున్నారా? చెప్పండి అని వేడుకున్నాడు. వేదవ్యాసుడు నవ్వి, ఓహో అదా నీ సందేహం. అయన పరమ విష్ణు భక్తుడు. అయన జపించే నామం వలన విష్ణు శక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వదు. పట్టుకోవాలని ప్రయత్నించవా! విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగాన్నే లేకుండా చేస్తాడు. త్రికరణ శుద్దిగా నిత్యం ” ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారిని నువ్వు కనీసం తాకనుకూడా తాకలేవు. కనుక ”ఓం నమో భగవతే వాసుదేవాయ” ఈ మంత్రాన్ని ప్రజలు పట్టుకునే లోపే నువ్వు పట్టుకో. లేదంటే నీ రాజ్యంలో నువ్వు ఉండలేవు. అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఇంతటి మహత్తరమైన ఈ మంత్రాన్ని నిత్యం జపించండి.
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ..........

ఆయుర్దాయం...........

ఆయుర్దాయం...........
యస్మిన్ విన్యస్య భారం విజయిని జగతాం జఙ్గమస్థావరాణాం
లక్ష్మీనారాయణాఖ్యం మిథునమనుభవత్యత్యుదారాన్ విహారాన్|
ఆరోగ్యం భూతిమాయుః కృతమిహ బహునా యద్యదాస్థపదం వః
తత్తత్సద్యః సమస్తం దిశతు స పురుషో దివ్య హేత్యక్షవర్తీ||
“శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి” అనేది వేద పురుష ఆశీర్వచనం. మనలను నిండా నూరేళ్లు బ్రతకమని వేదం ఆశీర్వదిస్తోంది. వేద మంత్రానికి ఉన్న శక్తి గొప్పది కాబట్టి వేదజ్ఞులైన పెద్దలకు నమస్కరించి వారిచే ఈ ఆశీర్వచనం పొందుతూ ఉంటాం. అలాగే నిత్యం చేసుకొనే సూర్యోపస్థానంలో “పశ్యేమ శరదశ్శతం, జీవేమ శరదశ్శతం, నందామ శరదశ్శతం, మోదామ శరదశ్శతం” అని చెప్పబడించి. “నిండు నూరేళ్లు ఆ సూర్యుని చూడగలగాలి. నిండా నూరేళ్ళు జీవించాలి. ఆది కూడ ఆనందంగా జీవించాలి” అని ఆకాంక్షిస్తాం. ఇలా ఆకాంక్షించటంలో ఎంతో విలువ ఉంది. “గుడ్ మార్నింగ్” అని చెప్పడం, “గుడ్ నైట్” చెప్పటంలోనూ లౌకికంగా కూడ అట్టి ఆకాంక్షలు ఆధునిక కాలంలోనూ అనుసరిస్తూనే ఉన్నాం. మంచి మనస్సు నుండి వచ్చే శుభాశీస్సుకు, శుభాకాంక్షాలకు కూడ శక్తి ఉంది. దాని వలన మేలూ జరుగుతుంది. ఇది పూర్వకాలపు విషయమే కాదు, నేటి విషయం కూడా అని అర్థం చేసుకొనగలం.
“బ్రతికి యుండిన శుభములు బడయవచ్చు” కాబట్టి బ్రతికి ఉండటం అంటే ఆయుర్దాయం మొదట కోరదగినది. అందుకే ఏ పూజ చేసినా సంకల్పంలో ఆయురారోగ్య భోగభాగ్యాలు కాంక్షిస్తాం. అందులో ముందు కోరేది ఆయుర్దాయాన్నే. కోట్ల సంపద లభించినా అయుర్దాయం లేక మరుసటి రోజే మరణించే వానికి ఈ కోట్ల సంపద వలన ప్రయోజనమేమిటి? అందువలనే మొదట కోరదగినది ఆయుర్దాయం. నిజమే. ఆయుర్దాయమనేది కోరుకొంటే వచ్చేదా? అనేది ప్రశ్న. “దీర్ఘాయుష్మాన్ భవ” అని దీవించటం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందా? ఆని సందేహం.
ఆయుః కర్మ చ విత్తం చ విద్యా నిధన మేవ చ|
పంచైతా న్యపి సృజ్యంతే గర్భస్థస్తైవ దేహినః||
అని చెప్పబడింది. అంటే “ఆయుష్షు, వృత్తి, ధనం, విద్య, చావు అనేవి ఐదూ జీవి గర్భంలో ఉండగానే నిర్ణయింపబడుతూ ఉంటా”యని దాని అర్థం. ఆయుర్దాయం, మరణం అనేవి ముందే నిర్ణయింపబడితే ఇంకా ఈ ఆశీస్సుల వల్ల కాని, మరే జాగ్రత్తల వల్ల కాని ప్రయోజనమేమిటని ప్రశ్న. “లలాట లిఖితా రేఖా పరిమార్ట్షుం న శక్యతే” నుదుట వ్రాసిపెట్టినది ఎవరూ తుడవలేరని, మార్చలేరని, జరిగి తీరుతుందని మరికొందరి మాట. “ఏది నిజం” మనేది సామాన్యునకు వచ్చే ప్రశ్న. ఆయుష్షుకు వృద్ధి, క్షీణతలు ఉంటాయా? ఉంటేనే దాని విషయంలో జాగ్రత్తలు తీసుకొనటం అవసరం తప్ప అదేమీ లేనప్పుడా యత్నమే వ్యర్థం కదా! ఆయుర్వేదం అనే వైద్య విధానం పేరులోనే ఆయువు ఉన్నది. ఆయుర్వేదమనేది ఊసుపోక చెప్పిన సామాన్యపు మాట కాదు. వేదాలలో మొదటిదైన ఋగ్వేదానికి సంబంధించిన ఉపవేదమే ఆయుర్వేదం. అంటే ఆయువును గూర్చి తెలిసికొనదగిన విజ్ఞానం అది. అందువల్ల ఆయువునకు సంబంధించి వృద్ధి క్షయాలు కూడ పరిగణింపదగినవే అని తెలుస్తుంది.
లలాట లిఖితమైన ఆయుర్దాయాన్ని ఎవ్వరూ మార్చలేరనేది యదార్థమైనా మార్కండేయుడు, శంకరాచార్యుల వారు మొదలైన వారు దైవానుగ్రహం వలన ఆయుర్దాయాన్ని పెంచుకొనటం చూస్తాం. అంతే కాదు హనుమంతుడు, విభీషణుడు మొదలగు వారు చిరంజీవులుగా పరమందటమూ చూస్తాం. ఇంకా విశేషం ద్వాపర యుగంలో చనిపోయిన సాందీపని గురువు యొక్క పుత్రుని శ్రీకృష్ణుడు బ్రతికించినట్లు, త్రేతాయుగంలో చనిపోయిన వానర వీరుడు గంధమాదనుని హనుమంతుడు బ్రతికించి తెచ్చినట్లు కూడ ఇతిహాసాల ద్వారా తెలిసికొన్నాం. కాబట్టి దైవానుగ్రహం వలన కాని, అమోఘవచనులైన ఋష్యాదుల ఆశీర్వచనాల వల్ల కాని ఆయుర్దాయం పెంచుకొనటం సాధ్యమే అని తెలుస్తుంది. కాబట్టే మన పూర్వజులు “ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం” అని సంకల్పంలో చెప్పుకొనటంలో అనౌచిత్యం లేదని, “శతమానం భవతి” అంటూ మహనీయుల ఆశీస్సులు పొందటం శ్రేయస్కరమే అని తెలుస్తుంది. అందుకే అట్టి ఆశీర్వచనాల కోసం పెద్దల యెడ వినయ విధేయతలతో ఉండాలి.

కాలభైరవుడు.............

కాలభైరవుడు.............
" దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం
వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం
నారదాది యోగిబృంద వందితం దిగంబరం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే "
కాలభైరవుడు పరమేశ్వరుని అపరాంశ. రౌద్రస్వరూపుడు. రక్షాదక్షుడు. దుష్టగ్రహబాధలు నివారించగల శక్తి మంతుడు. కాలభైరవుడు అనగానే హేళనగా కుక్క అనేస్తాం. కుక్కను వాహనంగా చేసుకుని తిరిగే వాడే తప్ప ఆయనే కుక్క కాదు. కుక్క అంటే విశ్వసనీయతకు మారుపేరు. రక్షణకు కూడా తిరుగులేని పేరు. సమయోచిత జ్ఞానానికి ప్రతీక.
భైరవః పూర్ణ రూపోహి శంకరస్యపరాత్మనః
మూఢాస్తంవై నజానంతి మోహితాశ్శివమాయయా..........
...అంటుంది శతరుద్రసంహితం. శివపురాణమూ, కాశీఖండమూ కాలభైరవుడి గొప్పదనాన్ని కొనియాడాయి. భైరవుడిని స్మరించుకోవడానికైనా ఓ యోగం ఉండాలంటారు. పక్కనే కాలభైరవక్షేత్రం ఉన్నా చాలా సందర్భాల్లో మనం పట్టించుకోం. లోపలికెళ్లాలన్న ఆలోచనా రాదు. అందుకో కారణం ఉందంటారు ఆధ్యాత్మికవేత్తలు. పరమశివుడు మనల్ని ఓరకమైన మాయాలో పడేస్తాడట. దీంతో... కాలభైరవుడి మహత్తును అర్థం చేసుకోలేకపోతామట. ఆ మాయాపొర తొలగిననాడు... పరమేశ్వరుడి పూర్ణాంశ అయిన కాలభైరవుడు కట్టెదుట దర్శనమిస్తాడు. కాలభైరవ ఉపాసన ప్రాచీనమైంది. భైరవుడిని పూజిస్తే గ్రహ దోషాలూ, అపమృత్యు గండాలూ తొలగిపోతాయనీ ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయనీ మంత్రశాస్త్రం చెబుతోంది. కాశీ మహానగరం, ఉజ్జయిని తదితర ప్రాచీన క్షేత్రాల్లో కాలభైరవుడి ఆలయాలున్నాయి.
ఎవరీ కాలభైరవుడు...
శివపురాణంలో కాలభైరవ వృత్తాంతం ఉంది. ఓసారి మహర్షులకు ఈశ్వర తత్వాన్ని అర్థం చేసుకోవాలన్న జిజ్ఞాస కలిగింది. ఎవరు చెబుతారా అని ఆలోచించారు. సృష్టికర్తను మించిన బ్రహ్మజ్ఞాని ఎవరుంటారు? నేరుగా బ్రహ్మ తపస్సు చేసుకుంటున్న మేరు పర్వతానికి వెళ్లారు. బ్రహ్మదేవుడు కూడా ఆ నిగూఢ రహస్యాన్ని తప్పక బోధిస్తానని మాటిచ్చాడు. అంతలోనే...సృష్టికర్త చుట్టూ ఓ మాయాపొరను సృష్టించాడు పరమేశ్వరుడు. దీంతో, మనసులో ఏ మూలనో ఉన్న అహంకారం బయటికొచ్చింది. ‘పిచ్చి మహర్షులూ! పరమతత్వం గురించి చెప్పేదేముంది? నేనే ఆ మహాతత్వాన్ని. స్వయంభువును నేను. విధాతను నేను. సృష్టిస్థితిలయ కారకుడినీ నేను. మీ ప్రశ్నకు జవాబు కూడా నేనే..’ అంటూ ప్రగల్బాలు పలికాడు. అక్కడే ఉన్న విష్ణుమూర్తికి ఆ మాటలు వినిపించాయి. మాయకే మాయలు నేర్పగలిగిన విష్ణుమూర్తిని కూడా మాయాపొర కమ్మేసింది. ‘కాదుకాదు...నేనే గొప్ప’ అంటూ వాదానికి దిగాడు. ఇద్దరూ కలసి వేదాల దగ్గరికెళ్లారు. వేదాలు పురుషరూపాన్ని ధరించి ‘యదంతస్థ్సాని భూతాని యత్సర్వం ప్రవర్తరే...’ - సకల ప్రాణుల్నీ తనలో లీనం చేసుకున్నవాడైన రుద్రుడే పరమతత్వం అంటూ ఆ వేదపురుషుడు పరమేశ్వరుడిని కొనియాడాడు. ఓంకారం కూడా శివుడే సర్వేశ్వరుడని నిర్ధారించింది. అంతలోనే...దివ్యతేజస్సుతో ముక్కంటి ప్రత్యక్షం అయ్యాడు.
ఆ ఆకారాన్ని చూసి బ్రహ్మ ఐదో తల ఫక్కున నవ్వింది. దీంతో శివుడు ఆగ్రహంతో వూగిపోయాడు. భృకుటి ముడిపడింది. అందులోంచి భయంకరమైన ఆకారంతో ఓ కాలపురుషుడు ఆవిర్భవించాడు. అతడే కాలభైరవుడు. భయంకరంగా ఉంటాడు కాబట్టి భైరవుడన్న పేరొచ్చింది. పాపాల్ని పరిహరించేవాడిగా ‘పాపభక్షు’ అయ్యాడు. కాలభైరవుడికి కాశీనగరం మీద ఆధిపత్యాన్ని ప్రసాదించాడు మహాదేవుడు. శివుడి ఆదేశాన్ని అనుసరించి ...తన వేలిగోటితో బ్రహ్మ ఐదో తలను తెగ నరికేశాడు కాలభైరవుడు. కానీ, ఆ తల కిందపడిపోకుండా భైరవుడి చేతికి అంటుకుపోయింది. అంతలోనే విష్ణువు చుట్టూ తిరుగుతున్న మాయ కూడా తొలగింది. శివతత్వాన్ని నోరారా మెచ్చుకున్నాడు. దీంతో, నాగభూషణుడు శాంతించి విష్ణుమూర్తిని ఆలింగనం చేసుకున్నాడు. చేతికి అంటుకున్న బ్రహ్మకపాలాన్ని మాత్రం కాలభైరవుడు వదిలించుకోలేకపోయాడు. ముల్లోకాలూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. కాశీనగరంలో కాలుపెట్టగానే, మహాద్భుతం జరిగినట్టు...కపాలం వూడిపడింది. దీంతో కాలభైరవుడు ఆనంద తాండవం చేశాడు. కాశీక్షేత్రంలోని ఆ ప్రాంతమే ‘కపాలమోచన’ దివ్యతీర్థంగా ప్రసిద్ధమైంది. ఇక్కడ పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు. ఈ తీర్థానికి ఎదురుగా కాలభైరవుడు కొలువుదీరాడు. పరమశివుడి ఆదేశం ప్రకారం...కాలభైరవుడే కాశీ క్షేత్రాధిపతి.

Saturday, 26 August 2017

దర్భ ( గడ్డి ) యొక్క ప్రాముఖ్యం...........

దర్భ ( గడ్డి ) యొక్క ప్రాముఖ్యం...........
మనకున్న పవిత్రమయిన వృక్ష సంపదలలో గడ్డి జాతికి చెందిన “దర్భ” ముఖ్యమయినది. ఈ దర్భలో చాలా జాతులున్నాయి. వీటిలో దర్భ జాతి దర్భను అపరకర్మలకు, కుశ జాతి దర్భనుశుకర్మలకు, బర్హిస్సు జాతి దర్భను యజ్ఞయాగాది శ్రౌత క్రతువులకు, శరము (రెల్లు) జాతి దర్భను గృహ నిర్మాణాలకు వినియోగించాలని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి.దీని ఆవిర్భావం వెనుక అనేక కథలున్నాయి. కొంతమంది దీనిని విశ్వామిత్రుని సృష్టిగా పరిగణిస్తారు. కూర్మ పురాణం ప్రకారం, విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతాన్ని (క్షీరసాగర మధనం సందర్భములో) మోస్తున్నప్పుడు, ఆ పర్వత రాపిడికి కూర్మము వంటిమీద ఉండే కేశములు సముద్రములో కలిసి అవి మెల్లిగా ఒడ్డుకు కొట్టుకొనిపోయి కుశముగా మారాయనీ, అమృతం వచ్చినప్పుడు కొన్ని చుక్కలు ఈ కుశ అనే గడ్డి మీద పడటం వలన వాటికి అంత పవిత్రత సంతరించుకుంది అనీ చెప్పబడింది. వరాహ పురాణం ప్రకారం, ఈ దర్భలు వరాహావతారములో ఉన్న శ్రీమహావిష్ణువుశరీర కేశములని చెప్పబడింది. అందువలననే దర్భ గడ్డిని శ్రీ మహావిష్ణువు రూపములని జనులు భావించి భాద్రపద మాసంలో దర్భాష్టమి నాడు వీటికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వీటికి దేన్నయినా శుద్ధి చేసే శక్తి ఉందని నమ్మిక. ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ శాస్త్రవేత్తలు వీటిని విరేచనాలు, రక్తస్రావం, మూత్రపిండాలలో రాళ్ళు, మూత్రవిసర్జనలో లోపాలు మొదలయిన వానికి మందుగా వాడుతున్నారు.
అలానే ముంజ పర్వతం మీద ఉండే దర్భ అతిసారాది రోగాలకు ఔషధమని అథర్వణ వేదంలో చెప్పబడింది.అసలు దర్భ అన్న పదం వినగానే మనకు గుర్తుకొచ్చేది గ్రహణ కాలం. ఆ సమయంలో అన్నిటి మీదా దర్భను ఉంచడం మనకు అలవాటు. కానీ అలా చేయటం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటంటే:సూర్య, చంద్ర గ్రహణ సమయాలలో కొన్ని హానికరమయిన విష కిరణాలు భూమి మీదకు ప్రసారమవుతాయని ఈనాటి విజ్ఞానశాస్త్రంనిరూపిస్తోంది. ఇలాంటి వ్యతిరేక కిరణాలు దర్భల కట్టల మధ్యలోంచి దూరి వెళ్ళలేకపోతున్నాయని ఇటీవల కొన్ని పరిశోధనలలో కూడా తేలింది. అందుకే ఆఫ్రికా ప్రాంతంలోని కొన్ని ఆటవిక జాతులు తమ గృహాలను పూర్తిగా దర్భగడ్డితోనే నిర్మించుకుంటున్నారు. ఈ విషయాన్ని మన సనాతన మహర్షులు గూడా గుర్తించి, గ్రహణ సమయంలో, ముఖ్యంగా సూర్యగ్రహణ సమయంలో ఇళ్ళ కప్పులను దర్భగడ్డితోకప్పుకొమ్మని శాసనం చేశారు (బహుశా అందుకనే గడ్డితో ఇంటి పైకప్పుని ఎక్కువగా కప్పుకునేవారు).కాలక్రమంలో ఆ శాసనం మార్పులు చెంది, ఇంటి మధ్యలో రెండు దర్భ పరకలు పరచుకొని తూ తూ మంత్రంలా కానిచ్చేస్తున్నారు. ఇలాకాక, కనీసం పిడికెడు దర్భలైనా ప్రతివ్యక్తీ గ్రహణ సమయాలలో శిరస్సుమీద కప్పుకొంటే, చెడు కిరణాల ప్రభావం వుండదని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. సదాశివరావు అనే ఒక వైద్యులు ఈ దర్భ గురించిన ఎన్నో విషయాలను తెలుసుకుని, నమ్మకం కుదరక, కొన్ని దర్భలను తీసుకుని అరచేతిలో ఉంచుకుని మరీ X-Ray తీయించుకోగా, ఆయన నమ్మలేని విధంగా అరవై శాతం రేడియేషన్ ఈ దర్భ గడ్డి చేత శోషించబడిందిట. దీనికి కారణం దర్భల కొనలుతేజమును కలిగి ఉండుట.
ఇటువంటి దర్భ గురించి మరెన్నో ఆసక్తికరమయిన విషయాలున్నాయి.శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనఃనాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజినకుశోత్తరంఅని భగవద్గీతలో చెప్పబడింది. అంటే ఒక మంచి, స్థిరమయిన ప్రదేశంలో, మనసుని లగ్నం చేసేందుకు సరయిన ఆసనం ఎత్తుగా కాకుండా, మరీ క్రిందకి కాకుండా, చక్కని కుశ గడ్డిని పరచి, దాని మీద జింక చర్మం వేసి ఆ పైన ఒక చక్కని వస్త్రము ఉండేటటువంటి దర్భాసనమే ధ్యానానికి ఉత్తమం అని శ్రీకృష్ణుడు చెప్తారు. అలానే తైత్తరీయోపనిషత్తులో బర్హిషావై ప్రజాపతి: అని ఉంది. అనగా బర్హిష అనే గడ్డిని పరిచి దాని పైన ప్రజలను ఉత్పన్నం చేయటం, వృద్ధి పరచటం చేసేవారని చెప్పబడింది. ఋగ్వేదంలో కూడా వీటి ప్రస్తావన ఉంది. ఈ రకమయిన గడ్డి ఎక్కువగా ఉండే ద్వీపాన్ని కుశ ద్వీపం అని కూడా అంటారు. వీటిని గూర్చి మన వేమన గారు ఏమన్నారో చూడండి:దాతగానివాని తఱచుగా వేఁడినవాడుఁ దాతయగునె వసుధలోనఅవురు దర్భ యౌనె యబ్ధిలో ముంచినవిశ్వదాభిరామ వినర వేమ!అనగా దానము అంటే ఎరుగని వాడిని ఎన్నిసార్లు అడిగినా వాడు దానము ఇస్తాడా? దాత అవుతాడా? అదే విధముగా ఇంటిపై కప్పు గడ్డిని పవిత్రమైన సముద్రములో ముంచినంత మాత్రాన దాని రూపు మారి దర్భ అవుతుందా? అని. కానీ ఇక్కడ ఇంటిపైకప్పు గడ్డి అన్నది రెల్లు గడ్డి కాదని గుర్తుంచుకోమని మనవి. ఈ విధముగా దర్భలు ఆధ్యాత్మికతతో పాటూ సాహిత్యంలో కూడా చోటు సంపాదించుకున్నాయి.వేద పాఠం మననం చేసుకునేటప్పుడూ, నేర్చుకునేటప్పుడూ, పఠించేటప్పుడూ దర్భ ఉంగరం కుడి చేతి ఉంగరం వేలికి ధరించాలి అని మన శాస్త్రాల్లో చెప్పబడింది. చావు సంబంధిత కర్మలకి ఏక ఆకు దర్భని, శుభప్రదమయిన వాటికి రెండు ఆకుల దర్భని, అశుభకార్యాలకి (పితృ పూజ, తర్పణాలు, మొ) మూడు ఆకుల దర్భని, పూజా తదితర కార్యక్రమాలకు నాలుగు ఆకుల దర్భని ఉంగరముగా వాడవలెననీ ఉంది.
అలానే శ్రాద్ధ కర్మలకు బ్రాహ్మణులు దొరకని పక్షంలో దర్భ ఉంగరాన్ని ఆ స్థానంలో ఉంచి కర్మ చేయవలెనని శ్రీ పద్మ పురాణములో చెప్పబడింది.దర్భల కొనలు విడుదల చేసే తేజము – దేవతలనూ, పితృ దేవతలను సైతం ఆకర్షించి మనం ఏ పనయితే చేస్తున్నామో ఆ పనికి తగ్గట్టు వారిని ఆహ్వానించి మన ముందు ఉంచుతుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. సమూలస్తు భవేత్ దర్భః పితృణాం శ్రాద్ధ కర్మణింఅన్నట్టుగా దర్భను వేరుతో (మూలము నుండి) సహా భూమి నుండి పెకిలించి దానిని వాడాలి. ఎందుకంటే ఈ వేరులు మాత్రమే పితృ లోకంలోని పితృ దేవతలకు విజయాన్ని చేకూరుస్తాయని అంటారు. అందుకే యజ్ఞ యాగాదులలో అగ్ని గుండానికి నలువైపులా దర్భలను పరుస్తారు.వీటికి ఉండే సహజసిద్ధమయిన గుణములను ఆరు నెలల తరువాత కోల్పోతాయిట. ఇవి స్వ, పర జనాల కోపాలను పోగొట్టి, సముద్రాన్ని సైతం అణచిపెడుతుంది అని అథర్వణ వేదంలో చెప్పబడింది. దర్భలను ఎక్కువగా వాడుట వలన మనలో సత్వ గుణం పెరుగుతుంది. ఒకవేళ మనం వాటిని నేలకేసి కొట్టినా, గోటితో చీలినా, వాటికి ఎటువంటి హాని కలుగ చేసినా మనలో రజ-తమో గుణాల తీవ్రత పెరిగి మనలో ఉండే సత్వ గుణాన్ని కూడా నాశనం చేస్తుందిట. వీటిని పౌర్ణమి తరువాత వచ్చే పాడ్యమి నాడు మాత్రమే ఈ క్రింది శ్లోకం చదువుతూ కొయ్యాలి:విరించినా సహోత్పన్న పరమేష్ఠి నిసర్గజనుద సర్వాణి పాపాని దర్భ స్వస్తికరో భవఈ విధముగా దర్భలు ఎన్నో కార్యక్రమాలలో, ఎన్నో విషయాలలో మనకు చేరువయ్యాయి. దర్భల కొన కోసుగా ఉండుట వలననే అమృతం నాకడానికి వచ్చిన పాముల నాలుకలు రెండు క్రింద చీలాయని నిందలు భరించినా అవి మాత్రం మనకు ఎన్నో విధాలుగా మంచి చేస్తూ, సహకరిస్తూనే ఉన్నాయి. వీటి విలువ తెలిసింది కనుక ఎప్పుడూ ఒక గుప్పెడన్నా ఇంట్లోఉండేలా చూసుకోవడం మరువకండి.

Friday, 25 August 2017

తిరుమల చరిత్ర...........

తిరుమల చరిత్ర
తిరుమల కలియుగ వైకుంఠం. కలియుగంలో దర్శన ప్రార్థనార్చనలతో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలోని ఆనంద నిలయంలో అవతరించాడు. తిరుమల ఆలయాన్ని, ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు.
దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వేంకటేశ్వరుని దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాభ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాభ్దానికి చెందిన చోళులు (తంజావురు) పాండ్య రాజులు (మదురై), 13-14 శతాభ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెప్తున్నాయి. విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది, ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతుడైన శ్రీ కృష్ణదేవ రాయలు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి.
తిరుమల కాలక్రమము.
ఇక్కడ లభ్యమైన శాసనాలనుబట్టి 15 వందల ఏళ్ల నాటి నుండి తిరుమల చరిత్ర ఈ విధంగా ఉంది. పల్లవ రాణి సామవై క్రీ.శ.614. ఈ మహారాణి కాలంలో ఆనంద నిలయం జీర్ణోద్దరణ కావింపబడింది. శ్రీవారి అనేక ఆభరణాలు సమర్పిస్తూ, ఉత్సవాలు నిర్వహిస్తూ పరమభక్త శిరోమణిగా తిరుమల చ్రిత్రలో శాశ్వతంగా నిలిచింది.ఈమెకి 'పేరుందేవి'అని మరో పేరువుంది. తరువాత తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు క్రీ.శ.1328, శ్రీ త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాధయాధవరాయలు క్రీ.శ.1429, హరిహరరాయలు క్రీ.శ. 1446 లలో బ్రహ్మోత్సవాలు నిర్వహించారు.
సాళువ నరసింహరాయలు క్రీ.శ.1470 లో భార్య ఇద్దరు కుమారుల తన పేర్లతో సంపగి ప్రదక్షిణం నాలుగు మూలలో నాలుగు స్తంభాల మండపాలని నిర్మిచాడు.క్రీ.శ.1473 లో తిరుమలరాయ మండపానికి వేదిక నిర్మించాడు. ఉత్సవాలు జరిపించేవాడు.
శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ.1513 నుండి 1521 వరకు ఏడు సార్లు తిరుమలకి వచ్చి ఎన్నో కానుకలు సమర్పించాడు, ఉత్సవాలు నిర్వహించాడు. రాయలు 1513 ఫిబ్రవరి 10 న 25 వెండి పళ్లాలను ఇవ్వగా, స్వామివారి పాల ఆరగింపు కొరకు రాయల దేవేరులు రెండు బంగారు గిన్నెలు ఇచ్చారు. 1513 మే 2న రెండవసారి, 1513 జూన్ 13న మూడో సారి తిరుమల సందర్శించి, మూల విరాట్టుకు ఆభరణాలు, ఉత్సవ మూర్తులకు మూడు మణిమయ కిరీటాలు సమర్పించాడు. నిత్య నైవేద్యానికి ఐదు గ్రామాలను కానుకగా ఇచ్చాడు. 1514 జూన్ 6న నాల్గవసారి తిరుమలని దర్శించి,30 వేల వరహాలతో కనకాభిషేకం చేసాడు. నిత్యారాధన కోసం తాళ్ళపాక గ్రామాన్ని దానంగా ఇచ్చాడు.
1517 జనవరి 2న ఐదవ సారి తిరుమలకు వచ్చి ఆలయ ప్రాంగణంలో తమ విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నాడు. 1518 సెప్టంబర్ 9న ఆనందనిలయానికి బంగారు పూత చేయించాడు. 1518 లో ఆరవసారి, 1521 ఫిబ్రవరి 17న ఏడవసారి తిరుమలకి వచ్చి నవరత్న కుళ్ళాయిని, పీతాంబరాలని సమర్పించాడు.
అచ్యుత రాయలు 1530 లో ఉత్సవాలు నిర్వహించాడు. ఆలయానికి ఎన్నో గ్రామాలు భూములను కానుకగా ఇచ్చాడు. 16 శతాబ్దం చివరలో తిరుమల రాయలు అన్నాఊయల మండపాన్ని విస్తరింపజేసి, ఉత్సవాలు నిర్వహించాడు. 1570లో వెంకటపతి రాయలు చంద్రగిరిని పాలించిన కాలంలో ఆలయాన్ని పరిరక్షించాడు.
విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఆలయం మహమ్మదీయుల పరమైనది. కర్నాటకకు నవాబైన దావూద్ ఖాన్ హైదరాబాదు నిజాం ప్రభువులకి కట్టవలసిన పన్నుల కొరకై ఆలయంపై పన్నులు విధించాడు. ఈ ఆదాయానికై మహమ్మదీయులు, మరాఠాలు గొడవలు పడ్డారు, 1740 లో మరాఠీ ప్రభువు ఆలయాన్ని స్వాధీన పరచుకుని, రక్షించి స్వామివారికి ఎన్నో అమ్మూల్య ఆభరణాలు సమర్పించాడు.
తరువాత క్రమంగా 1801 నాటికి ఆలయం ఈస్టిండియా కంపెనీ వారి వశమైంది. ఈస్టిండియా కంపెనీ మొదట్లో హిందూ దేవాలయాలను, ముస్లిముల మసీదులను కాపాడుతూ వారి ధర్మాలను స్వయంగా పరిపాలించేవారు. దీనికి సంబంధించిన శాసనం ఒకటి క్రీ.శ.1810లో బెంగాలు ప్రాంతంలో వేయించారు. క్రీ.శ.1817లో చేసిన 7వ రెగ్యులేషన్ చట్టంలో కూడా ఇదే పాలసీని కొనసాగించారు. ధర్మాదాయాల సొమ్మును రెవెన్యూతో పాటు జిల్లా కలెక్టర్లు వసూలు చేసి, దేవునికి క్రమంతప్పక ఉ్సతవాలు, అర్చనలు, భోగాలు స్వయంగా పర్యవేక్షించి జరిపేవారు. దేవాలయంపై వచ్చిన సొమ్ములో ఈ కార్యక్రమాలు చేశాకా మిగిలిన సొమ్ము ఈస్టిండియా కంపెనీ వారి ఖజానాలో చేరేది. కలెక్టర్లపై రెవెన్యూబోర్డుకు తనిఖీ అధికారం ఉండేది. తిరుమల దేవాలయాన్ని కూడా ఇదే పద్ధతిలో పరిపాలన చేసేవారు. దేవాలయంలో చేయాల్సిన సేవలు, ఉత్సవాలు, అర్చనలకు ఖర్చుచేయగా కంపెనీకి మిగిలిన ఆదాయం 1830లోనే దాదాపుగా సాలుకు రూ.లక్షకు పైగా ఉండేదంటే తిరుమల వైభవం ఊహించవచ్చు. తిరుమలలో ఏ దానధర్మాలు చేయాలన్నా ప్రభుత్వానికి సొమ్ము ఇచ్చుకోవలసిన స్థితి ఉండేది [1]. క్రైస్తవ మిషనరీలు కంపెనీ ప్రభుత్వం హిందూదేవాలయాలను, ముస్లిముల మసీదులను నిర్వహించడం ప్రోత్సహించడం క్రిందికే వస్తుందని, ఇది సరైన పని కాదని ఇంగ్లాండులో ఆందోళన చేయగా 1833 నుంచి కంపెనీ వారు దేశంలో మతాల పట్ల జోక్యం కలిగించుకోరాదన్న పద్ధతిలో ప్రవర్తించడం ప్రారంభించారు. ఐతే తిరుమల, పూరి వంటి సుప్రసిద్ధ ఆలయాలకు వచ్చే ఆదాయం బాగా ఎక్కువ కావడంతో వాటిని తమ వశంలోనే ఉంచుకున్నది. ఎప్పటిలా కంపెనీ ఉద్యోగులే నిర్వహించేవారు. ఐతే 1841లో ఆంగ్లప్రభుత్వం హిందూ మతసంస్థలలో జోక్యం చెసుకోకూడదని చట్టం చేసినందున ఆ ఆలయ నిర్వహణ మహంతులకు అప్పజెప్పింది. అప్పటి నుంచి 1863 వరకూ దేవాలయాలను సక్రమంగా నిర్వహించే నాథుడులేక, ఉన్న ధర్మకర్తలు అక్రమాలకు పాల్పడుతూండడం మూలంగా బ్రిటీష్ ఇండియాలోని దేవాలయాలు దెబ్బతిన్నాయి. ఈ స్థితిలో 1863లో కొత్త దేవాదాయధర్మాదాయ చట్టం ఈ అరాచక స్థితిని సరిజేసే ప్రయత్నం చేసింది.[1] 1843 నుండి -
మహంతు సేవాదాస్ జీ,
మహంతు ధర్మ దాస్ జీ,
మహంతు భగవాన్ దాస్ జీ,
మహా వీరదాస్ జీ,
రామకృష్ణ దాస్ జీ,
ప్రయాగదాస్ జీ,
ఇలా 90 ఏళ్ల పాటు మహంతుల పాలనసాగింది.
వీరి తరువాత,1933 లోఅప్పటి గవర్నర్ ధర్మ కర్తల మండలిని ఏర్పాటు చేసాడు.
19 వ శతాబ్దాంతానికి కొండపైన శ్రీవారి ఆలయం, హథీరాంజీ మఠం తప్ప వేరే ఏ నిర్మాణాలూ ఉండేవి కావు. అర్చకులు సైతం కొండ కింద ఉన్న కొత్తూరులోనే ఉండేవాళ్లు. తెల్లవారుజామునే లేచి సప్తగిరులూ ఎక్కి ఉదయం ఏడు గంటలకు స్వామికి మేలుకొలుపులు పాడేవారు. అడవి జంతువులు, దొంగల భయంతో యాత్రికులు గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ, గోవిందనామ స్మరణ చేస్తూ కొండ ఎక్కేవారు. రాళ్లూరప్పలూ నిండిన దారిలో కొంతసేపు వెళుతూ మధ్యలో వంటావార్పు కోసం ఆగుతూ... మొత్తానికి పైకి చేరుకునేసరికి దాదాపు రెండురోజులు పట్టేదట. వారు మధ్యలో ఆగేందుకు మూడుచోట్ల దిగుడుబావులూ విశ్రాంతి మండపాలూ ఉండేవి. వాటిని ఠాణాలు అనేవారు. వయసు మళ్లినవారినీ అంగవికలురనూ పిల్లలనూ పైకి తీసుకువెళ్లేందుకు డోలీ కూలీలు ఉండేవారు. కావడి బద్దకు కుర్చీలు అమర్చి నడవలేనివారిని వాటి మీద కూచోబెట్టుకుని వారు పైకి మోసుకెళ్లేవారు. అందుకు పది అణాలు రుసుము వసూలు చేసేవారు. సామాన్యులకు ఆ మాత్రం స్తోమత కూడా ఉండేది కాదు. తిరుమల రాగిచెట్టు (ఇప్పుడు కల్యాణకట్ట ఉన్న ప్రదేశం) దగ్గర డోలీలు నిలుపుకోవడానికి ఒక ప్రత్యేక మండపం ఉండేది. అక్కడిదాకానే ఈ డోలీలను అనుమతించేవారు. ఆ స్టాండును డోలీమండపం బ్లాక్ అనేవారు. (ఇప్పుడా రోడ్డునే డి.ఎం.బి. రోడ్డుగా వ్యవహరిస్తున్నారు.) అక్కణ్నుంచి సన్నిధి వీధి మీదుగా గుడికి చేరుకుని నేరుగా మహాద్వారం గుండా లోపలికి ప్రవేశించి భక్తులు స్వామి దర్శనం చేసుకొనేవారు. 1870లో ప్రభుత్వం యాత్రికుల సౌకర్యార్థం కొండమీదకు మెట్లు నిర్మించింది. 1933లో ఏర్పడిన తితిదేబోర్డు రూ.26వేల ఖర్చుతో ఆ మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసింది. ఐదుపదుల ఏళ్లనాటి దేవస్థానం రికార్డుల ప్రకారం అప్పట్లో పొద్దున ఏడున్నరకు సుప్రభాత సేవ, రాత్రి పదిన్నరకు ఏకాంతసేవ జరిగేవి. ఇప్పుడు రాత్రి రెండున్నరకు ఆలయం మూసివేసి సరిగ్గా అరగంటలోనే మళ్లీ సుప్రభాతంతో మేల్కొలుపులు మొదలుపెడుతున్నారు.
కొండ మీద ఊరు.
తిరుమల నిర్వహణ హథీరాంజీ మఠం ఆధ్వర్యంలో ఉన్నప్పుడు యాత్రికులకు సౌకర్యాలు ఏర్పరచాలంటే చాలా కష్టమయ్యేది. ఎందుకంటే అక్కడ ఎవరూ ఉండేవారు కాదు. తిరుమలలోనే ఉందామంటే విపరీతమైన చలి. దానికి తోడు ఆ ప్రాంతమంతా అడవిలా ఉండేది. జంతువుల భయం సరేసరి. కొండమీద ఒక ఊరు తయారైతే ఈ ఇబ్బందులన్నీ అధిగమించవచ్చన్న ఆలోచనతో 1910-20 కాలం నాటికి జనావాసాలను ఏర్పరచేందుకు ప్రయత్నించారు. వారికి ఆవాసం కల్పించేందుకు హథీరాంజీ మఠం భూములు లీజుకు ఇచ్చింది. నెమ్మదిగా ఆలయం చుట్టూ నాలుగు వీధులతో ఒక ఊరు తయారైంది. మొదట్లో అక్కడి జనాభా 200 నుంచి 300 మంది మాత్రమే. స్వామిని చూడవచ్చే భక్తులకు ఈ కుటుంబాలే మొదట్లో అన్ని సౌకర్యాలూ కల్పించేవి. క్రమేణా తిరుమలలో ఉండే వారి సంఖ్య 25వేలకు పెరిగింది. 30 ఏళ్ల క్రితం వరకూ కూడా వారంతా రోజూ సరాసరి మహాద్వారం గుండానే గుడిలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకుని తమ పనులు చేసుకొనేవారు. కానీ యాత్రికుల సంఖ్య పెరుగుతుండటంతో తితిదే వారందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించి తిరుపతికి తరలించింది.
ఘాట్‌రోడ్డు నిర్మాణం.
1940ల నాటికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మెల్లగా పెరగడం మొదలైంది. అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం కొండమీదకు రోడ్డుమార్గం గురించి ఆలోచించింది. బ్రిటిష్ అధికారులు సర్వే బృందాల వారు తిరుపతి చేరుకున్నారు. 1944 ఏప్రిల్ నాటికి అలిపిరి నుంచి తిరుమల దాకా ఘాట్‌రోడ్డు నిర్మాణం పూర్తయింది. అదేనెల పదోతేదీన మద్రాసు రాష్ట్ర గవర్నర్ ఆర్ధర్‌హోప్ రోడ్డుమార్గాన్ని ప్రారంభించారు. మొదట్లో ఎద్దులబళ్లు, గుర్రపుబళ్లు తిరిగేవి. దీంతో భక్తుల పని సులువైంది. నెమ్మదిగా దేవస్థానమే తిరుమల-తిరుపతి మధ్య రెండు బస్సులు ప్రారంభించింది. ఆ సర్వీసులు తిరుపతిలోని మొదటిసత్రం నుంచి రోజుకు మూడుసార్లు ఉండేవి. తిరుమల నుంచి రాత్రి ఏడు దాటితే బస్సులే ఉండేవి కావు. 1955-56లో రైల్వేస్టేషన్ సమీపాన శ్రీనివాస బస్టాండు ఏర్పడే నాటికి భక్తుల సంఖ్య రోజుకు 500 నుంచి 600 వరకు ఉండేది. బస్సుల సంఖ్య పెంచుకుంటూ పోవడంతో సౌకర్యంగా ఉండి భక్తులు వెల్లువెత్తసాగారు. దీంతో రెండో ఘాట్‌రోడ్డు గురించి ఆలోచించాల్సి వచ్చింది. 1974 నాటికి అదీ పూర్తయింది.